హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాల్సిందేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రాజాను కలిశారు. పార్లమెంట్లో బిల్లుపెట్టి బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు, జనగణనలో కులగణన చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. దేశంలో 50 శాతం జనాభా ఉన్న బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, ప్రజాస్వామ్య వాటా సాధించేందుకు సీపీఐ పోరాడుతున్నదని పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశంలోనూ బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని తీర్మానం చేశామని చెప్పారు. కేంద్రాన్ని నిలదీస్తూ, బీసీల పక్షాన నిలబడేందుకు పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. రాజాను కలిసినవారిలో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, సంఘం నాయకులు ఉన్నారు.