హైదరాబాద్ సిటీబ్యూరో/ఉప్పల్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): 13 బీసీ ఆత్మగౌరవ భవనాలకు భూమిపూజ నిర్వహించుకోవడం వెనుకబడిన వర్గాల చరిత్రలో సువర్ణాధ్యాయమని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగు ల కమలాకర్ పేర్కొన్నారు. 75 ఏండ్ల స్వతం త్ర భారత చరిత్రలో ఏ ప్రధానీ, ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా వెనుకబడిన వర్గాలకు మేలు చేస్తున్న ఖ్యాతి ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని కొనియాడారు. గతంలో దరఖాస్తు ఇచ్చి దండం పెట్టినా గుంట స్థలం కూడా ఇవ్వలేదని, నేడు అడుగకుండానే రాజధాని నడిబొడ్డున కోకాపేట, ఉప్పల్ భగాయత్లో బీసీ కుల సంఘాలకు వేల కోట్ల విలువ చేసే 87.3 ఎకరాల భూమితోపాటు రూ.95 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ కేటాయించారని వివరించారు.
ఉప్పల్ భగాయత్లో ఆదివారం 13 బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సామూహికంగా నిర్వహించిన భూమిపూజ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుల సంఘ భవ నం శిలాఫలకం వద్దకు మంత్రులు స్వయంగా వెళ్లి, శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించి నవధాన్యాలతో భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఉప్పల్ భగాయత్లో మొ త్తం 22 కులాలకు 38 ఎకరాల భూమి కేటాయించామని వివరించారు. దసరా నాటికల్లా భవన నిర్మాణాలు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించుకోవాలని ఆయా సంఘాలకు సూచించారు.
ఈ ఆత్మగౌరవ భవనాలను త మ కులం ప్రతిష్ఠ ఇనుమడించేలా, సంస్కృతి వెల్లివిరిసేలా డిజైన్ చేసి నిర్మించుకోవడానికి ఆయా కుల సంఘాలకే సంపూర్ణ అధికారం సీఎం కేసీఆర్ కల్పించారని గుర్తుచేశారు. ప్రతి ఆత్మగౌరవ భవనంలో దూర ప్రాంతాల నుం చి వచ్చే వారికి వసతి, తమ సంస్కృతిని కండ్ల కు కట్టేలా కమ్యూనిటీ హాళ్లు, పిల్లలు చదువుకోవడానికి గ్రంథాలయం, రిక్రియేషన్ సెంట ర్ తదితర అన్ని సదుపాయాలు సమకూర్చుకోవాలని సూచించారు. వీటిలో రోడ్లు, తాగునీరు, మురుగునీటి కాల్వలు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా అది బీసీలకు అత్యధిక మేలు చేసే విధంగానే రూపొందిస్తుందని, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, గురుకులాలు ఇలా ప్రతి పథకంలో బీసీల వాటాను సగర్వంగా తీసుకుంటున్నామని వివరించారు. కోకాపేటలో నిర్మించనున్న ఆత్మగౌరవ భవనాలకు మంగళవారం భూమిపూజ చేస్తామని వెల్లడించారు.
సమూహంగా ఎదిగేందుకు బీసీ ఆత్మగౌరవ భవనాలు దోహదం చేస్తాయని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. కుల సంఘాల నేతలు ఏ పార్టీకి చెం దినవారైనా గుండె మీద చేయివేసుకొని ఆలోచిస్తే మనకు వేల కోట్ల విలువైన స్థలాలను ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని అర్థమవుతుందని అన్నారు. తెలంగాణ వస్తే ఎమోస్తది అన్న వారికి సీఎం కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలు నిదర్శనమని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. విశ్వబ్రాహ్మణులను గుర్తించి 5 ఎకరాలతోపాటు 5 కోట్లు ఇచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు.
ఉప్పల్లో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం, బీసీ కులాలకు వే దికగా ఉప్పల్ను చేయడం సంతోషంగా ఉన్నదని స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి చెప్పా రు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీశంకర్, బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర, కిశోర్, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం, ఉన్నతాధికారులు, రెవెన్యూ ఆర్అండ్ బీ శాఖల అధికారులు, పెద్ద ఎత్తున తరలివచ్చిన బీసీ కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.
బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పశుసంవర్ధకశాఖ మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కొనియాడారు. మంత్రి గంగుల అకుంఠిత దీక్ష, కఠోర శ్రమతో ఆత్మగౌరవ భవనాలు కార్యరూపం దాలుస్తున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కులవృత్తులకు చేయూత దొరికిందని వివరించారు. సమైక్య రాష్ట్రంలో నీళ్లులేక చెరువులు ఎండిపోగా, నేడు కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగి, దేశానికే అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని చెప్పారు.
దేశంలోనే అత్యధికంగా 2 లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. కాంగ్రెస్ దోపిడీ చేస్తుందని, బీజేపీ మతం మత్తులో ముంచుతుందని, బీఆర్ఎస్ మాత్రమే అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. 24 గంటల కరెంటు రాదని మాట్లాడేవారు ఒకసారి కరెంటు స్తంభం ముట్టుకుంటే తెలుస్తుందని చురకలేశారు. గుడికి వెళ్లడం, బొట్టు పెట్టుకోవడం బీజేపీ నేర్పిందా? అని ప్రశ్నించారు. కేంద్రం ఏ ప్రాంతానికి ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.