హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని బీఆర్ఎస్ కోరడం పట్ల్ల రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు హర్షం వ్యక్తం చేశారు. శనివారం కాచిగూడలో నిర్వహించిన జాతీయ బీసీదళ్ ప్రతినిధుల సమావేశంలో వకుళాభరణం మాట్లాడుతూ.. చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లులో బీసీ సబ్ కోటాను చేర్చాలని కోరారు.
బీసీల డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దండ్రు కుమారస్వామి మాట్లాడుతూ.. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టికపోతే దేశవ్యాప్తంగా ధర్మపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై వచ్చే నెల 3న జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో బీసీ జాగృతి అధ్యక్షుడు కే మురళీకృష్ణ, మేదరి రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాచమల్ల బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.