బండి సంజయ్పై ఆర్ కృష్ణయ్య ఆగ్రహం
కాచిగూడ, ఏప్రిల్ 13: అధికారంలో ఉన్నామని అహంకారంగా మాట్లాడొద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని హెచ్చరించారు. బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, వాటాదారులని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన బీసీ విద్యార్థి సంఘాల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సంజయ్ బీసీ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ బీసీ సంఘాలను విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. దేశంలోని కోట్ల మంది బీసీలకు ప్రధాని వ్యతిరేకమా? అని బండిని నిలదీశారు.
‘నీకు దమ్ము, ధైర్యం ఉంటే.. దేశంలో 56 శాతం ఉన్న బీసీలకు వెంటనే ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసేలా, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రాన్ని ఒప్పించు’ అని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయించాలని సూచించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో ఒకేసారి 80 వేల ఉద్యోగాల భర్తీకి పూనుకోవడం శుభ సూచకమని చెప్పారు. నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ, మట్ట జయంతిగౌడ్, అనంతయ్య, శివ, గజేందర్ తదితరులు పాల్గొన్నారు.