హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: పలు డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఢిల్లీలో పార్లమెంట్ ఎదుట భారీ ప్రదర్శన నిర్వహిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర సర్వీసుల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగ పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కోరారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల కల్పనకు రాజ్యాంగపరమైన, న్యాయపరమైన అవరోధాలు, అడ్డంకులు ఏమీలేవని, కేంద్రమే బీసీ వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్సీపీ రెండేండ్ల క్రితమే కోరగా బీఆర్ఎస్ సహా 14 పార్టీలు మద్దతు తెలిపాయని, ఒక్క బీజేపీనే వ్యతిరేకించిందని వివరించారు.
కేంద్ర సర్వీసుల్లో 16 లక్షల ఖాళీలు
16 లక్షల ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తున్నదని ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. రైల్వేశాఖలో 3.53 లక్షల ఉద్యోగాలు, వివిధ బ్యాంకుల్లో 1.30 లక్షలు, రక్షణ రంగ సంస్థల్లో 4.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. బీసీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించాలని, కేంద్ర స్థాయిలో రూ.2 లక్షల కోట్ల బడ్జెట్తో బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీలపై కులాలవారీగా లెకలు సేకరించాలని డిమాండ్ చేశారు.
అనంతరం ఈబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా చెన్నకేశవరెడ్డిని నియమిస్తూ, నియామక పత్రాన్ని ఆర్ కృష్ణయ్య అందజేశారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, అంజి, రాజేందర్, అనంతయ్య, రాజ్కుమార్, నందగోపాల్, కృష్ణయాదవ్, నిఖిల్, దీపిక తదితరులు పాల్గొన్నారు.