Jajula Srinivas Goud : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్(Fee Reimbursement)ను పాత పద్ధతిలోనే అమలు చేయాలని, ఫీజుల బకాయిలు తక్షణమే విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్లతో జూలై 2 (గురువారం) న తలపెట్టిన కాలేజీల బంద్ సంపూర్ణంగా విజయవంతం జరిగిందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) తెలిపారు. కాలేజీలో బంద్తోనైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని, లేకపోతే జూలై 6(సోమవారం)వ తేదీన హైదరాబాదులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని జూజుల హెచ్చరించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ను పూర్తిగా అమలు చేయాలని తాము ఆరు నెలలుగా శాంతియుతంగా, ప్రజాసంఘంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న ప్రభుత్వంలో చలనం రావడం లేదని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఇప్పటికే కలెక్టరేట్ల ముట్టడి, సచివాలయం ముట్టడి, నిరసన దీక్షలు చేపట్టినా ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం రావడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమం తరహాలోనే ఫీజు రీయింబర్స్మెంట్ ఉద్యమాన్ని ఉదృతం చేయడానికి జూలై 6 వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నామని జూజుల వెల్లడించారు. ఈ సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి, ప్రభుత్వం దిగివచ్చే వరకూ రీయింబర్స్మెంట్ ఉద్యమాన్ని కొనసాగిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
జూలై 2వ తేదీన జరిగిన కాలేజీల బంద్లో భాగంగా.. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్య కాలేజీలు స్వచ్ఛందంగా తమ కళాశాలను బంద్ పెట్టి ఫీజు స్వచ్ఛందంగా రీయింబర్స్మెంట్ ఉద్యమానికి పూర్తిగా సహకరించారని ఆయన చెప్పారు. బంద్కు మద్దతు పలికిన అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలకు, మీడియాకు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.