హైదరాబాద్ : బీసీ సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు. గురువారం భగీరథ మహర్షి(Maharishi Bhagiratha) జయంతి వేడుకలు రవీంద్రభారతీలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఆయన మాట్లాడుతూ నాటి భగీరథ మహర్షి దివి నుంచి భువికి గంగను తీసుకు వస్తే అపర భగీరథుడు సీఎం కేసీఆర్(CM KCR)నేడు గోదావరి జలాలను తెచ్చి తెలంగాణ పొలాలకు పారిస్తున్నారని అన్నారు. మిషన్ భగీరథ తో ఇంటింటికి తాగునీరు అందించిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్దేనని అన్నారు. 310 బీసీ గురుకులాలను ప్రపంచస్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు.
బీసీల ఆత్మగౌరవం కోసం వేల కోట్ల విలువైన కోకాపేట్, ఉప్పల్ భగాయత్ లాంటి ప్రాంతాల్లో 41 కుల సంఘాలకు 87.3 ఎకరాల్లో 95 కోట్లతో ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. భగీరథ మహర్షి వారసులైన సగరులకు సైతం కోకాపేట్ లో రెండు ఎకరాలను కేటాయించడమే కాకుండా రెండు కోట్ల నిధులను ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం వెచ్చించామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, సగర సంగం అధ్యక్షుడు శేఖర్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.