ముషీరాబాద్, జూలై 19: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, యాభై శాతం డిమాండ్ల సాధనే లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి 10 రోజులపాటు ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. 16 బీసీ సంఘాలతో కలిసి ఈ నెల 21న పార్లమెంటు వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టున్నట్టు చెప్పారు. బుధవారం విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం, జాతీయ దివ్యాంగుల హక్కుల వేదిక ‘చలో ఢిల్లీ’ కార్యక్రమ వాల్పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మహిళా, బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. బీసీ ఉద్యమ జాతర పేరిట 21 పార్లమెంటు వద్ద నిరసన ప్రదర్శన, మహిళలు, దివ్యాంగులు, ఇతర కుల సంఘాలతో 10 రోజులపాటు నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు చెప్పారు. దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టాలి
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే బీసీ బిల్లు పెట్టి, ఆమోదించాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. అదేవిధంగా, కులగణన చేపట్టాలని కోరారు. మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ వెనుకబడిన తరగతులను అణగతొక్కేయడానికే ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఇటీవల మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు బీసీల కోసం ఏమైనా ప్రకటన చేస్తారేమోనని ఆశించామని, కానీ అలాంటిదేమీ జరగలేదని పేర్కొన్నారు. వెంటనే బీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టకపోతే కేంద్రంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.