హైదరాబాద్ : స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం నేడు నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) బీసీ కమిషన్(BC Commission) పర్యటిస్తున్నది. రిజర్వేషన్ల ఖరారుకు ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తున్నారు. కాగా, ఉమ్మడి నిజామాద్ జిల్లాలోని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల ప్రతినిధులు ప్రజలు అభిప్రాయాలు చెప్పేందుకు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ విచారణ కొనసాగనున్నది. కాగా, వచ్చే నెల 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టనున్నది.
మరోవైపు న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా శాస్త్రీయపద్ధతిలో కులగణన నిర్వహించాలని, రిజర్వేషన్ల శాతాన్ని పెంచడంతోపాటు కులవృత్తుల ఆధునీకరణకు సైతం ఊతమివ్వాలని బీసీ కులసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు, పారిశ్రామిక రంగంలో సబ్సిడీలు, భూముల కేటాయింపు, బీసీ సబ్ప్లాన్, బీసీ కులాల ఉత్పత్తులకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రత్యేకమైన సెజ్లు, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం వంటి అంశాలతోపాటు కులాల వారీగా సమస్యలను, వాటికి తాము సూచిస్తున్న పరిషార మార్గాలను అమలుచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ మేరకు నేటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్న రాష్ట్ర బీసీ కమిషన్కు పెద్దఎత్తున వినతులు సమర్పించాలని కులసంఘాల ప్రతినిధులు పిలుపునిస్తున్నారు.