హైదరాబాద్ : చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీఎస్టీలో చేనేత ఉత్పత్తులపై 5శాతం పన్ను విధించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ.. తెలంగాణ చేనేత, జౌళీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు అంబర్పేటలోని పోస్టాఫీస్ వద్ద చేనేత ఉత్పత్తిదారులు, యువకులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కిశోర్ పోస్టుకార్డులు రాశారు.
తరతరాలుగా చేతివృత్తులు, కులవృత్తులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి అండగా నిలబడి ఆదరించాలన్నారు. రాయితీలు, సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోయి.. మోదీ ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై 5శాతం జీఎస్టీ విధించడం బాధాకరమన్నారు. వెంటనే జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జీఎస్టీని రద్దు చేసే వరకు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జీవన్, ప్రభాకర్, నిరంజన్, అశోక్, ఉమేశ్, రాజు, రమేశ్, భూమేశ్, వెంకటేశ్, కృష్ణ, రాజేష్, అంజి, చిన్ని తదితరులు పాల్గొన్నారు.