నాగర్కర్నూల్ : రాజకీయ నాయకులు గానీ, ఇతర కులాలు ఎవరైనా పిచ్చకుంట్ల(Picchakuntla )అనే పదం వాడితే వారిపై క్రిమినల్ కేసులు పెడతాం. ఇందుకు ప్రభుత్వం నుంచి త్వరలో ఉత్తర్వులు కూడా ఇస్తామని రాష్ట్ర బీసీ కమిషన్(BC Commission) చైర్మన్ గోపిశెట్టి నిరంజన్(Niranjan) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పిచ్చకుంట్ల అనే పేరు పిలవడం మానేసి వంశరాజ్ పేరు మాత్రమే పిలవాలని బీసీ కమిషన్కు విజ్ఞప్తులు వచ్చాయన్నారు. వాటన్నింటిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదికిస్తామని ఆయన తెలిపారు.
కాగా, రాష్ట్ర బీసీ కమిషన్ శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాలో(Mahabubnagar) పర్యటిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బి.సి. కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జయ ప్రకాష్, తిరుమల గిరి సురేందర్, బాలలక్ష్మి బహిరంగ విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు పాల్గొన్నారు.