బీసీ సంఘాల వెల్లడి
కాచిగూడ, జూన్ 4: బీసీ సమస్యలపై 47 ఏండ్లుగా పోరాటం చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై కొంతమంది బురద చల్లటం అవివేకమైన చర్య అని 20 ఉద్యోగ సంఘాలు, 28 బీసీ సంఘాలు, 36 కుల సంఘాల నాయకులు అన్నారు. ఆయన మచ్చలేని బీసీ నాయకుడు అని స్పష్టం చేశారు. ఆర్ కృష్ణయ్యపై పెట్టిన అక్రమ కేసును రవీందర్రెడ్డి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ శనివారం కాచిగూడలోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికవటం చంద్రబాబుకు మింగుడుపడటం లేదని, కేసు వెనుక టీడీపీ నేతల కుట్ర దాగి ఉన్నదని అన్నారు. త్వరలోనే వాస్తవాలను వెలికి తీస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, జాతీయ ఓబీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు రామకోఠి, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, యువజన సంఘం అధ్యక్షుడు రామ్మూర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.