ముంబై, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): భారత జాగృతి మహారాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో ముంబైలో బతుకమ్మ వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. దాదర్ ఈస్ట్లోని స్వామి నారాయణ్ రోడ్డులో ఉన్న యోగిహాల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగిన వేడుకల్లో ప్రముఖ గాయనీలు శివరంజని, నిరంజనిలతోపాటు జానపద గాయని శిరీష ఆట, పాటలతో అలరించారు. ప్రముఖ హాస్యనటుడు ఆర్ఎస్ నందా నవ్వులు పూయించారు. ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు బతుకమ్మలను చకగా అలంకరించుకొని తెచ్చారు.
ఈ సందర్భంగా భారత జాగృతి మహారాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ సుల్గే మాట్లాడుతూ.. బతుకుదెరువు కోసం సొంత ఊర్లను విడిచివచ్చినా.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మాత్రం మర్చిపోకుండా, వాటిని భావితరాలకు అందించడం గొప్ప విషయమని ప్రశంసించారు. బతుకమ్మలను అందంగా అలంకరించి తెచ్చివారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కొంకణ్ విభాగ సమన్వయకర్త ప్రొఫెసర్ విజయ్ మోహితె, థానే లోక్సభ సమన్వయకర్త మక్సూద్ఖాన్, భీవండి లోక్సభ సమన్వయకర్త ఎలిగేటి శ్రీనివాస్, జాగృతి కార్యకర్తలు సుల్గే సరిత, బండ్ల సుజాత, పారిపెల్లి లత, చిలివేరి విజయ, స్వరాంజలి అధినేత్రి, కవిత, దాసరి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.