హైదరాబాద్, నవంబర్11 (నమస్తే తెలంగాణ): నదీ జలాల పంపిణీలో పరీవాహక ప్రాంతాలకే తొలి ప్రాధాన్యమివ్వాలని సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ, తెలంగాణ తరఫు సాక్షి చేతన్ పండిత్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పంపిణీపై చేపట్టిన బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్-2 విచారణ శుక్రవారం రెండోరోజు కూడా ఢిల్లీలో కొనసాగింది. చేతన్ పండిత్ను ఏపీ సీనియర్ న్యాయవాది ఉమాపతి క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఆపరేషన్ ప్రొటోకాల్పై లేవనెత్తిన సందేహాలను పండిత్ నివృత్తి చేశారు. బేసిన్ అవతలి ప్రాంతాలకు నదీ జలాల మళ్లింపును జాతీయ జల విధానం 2002 వ్యతిరేకించలేదని, ఈ నేపథ్యంలో చేతన్ పండిత్ ప్రతిపాదించిన ఆపరేషన్ ప్రొటోకాల్ ప్రతిపాదన సరికాదని ఏపీ న్యాయవాది వాదించగా, దానిని పండిత్ తీవ్రంగా ఖండించారు. నదీ పరీవాహక ప్రాంతంలోని అవసరాలకు తొలి ప్రాధాన్యమివ్వాలనే జాతీయ జల విధానం సూచించిందని, అదే విషయాన్ని 2012 జాతీయ జల విధానం కూడా స్పష్టంగా క్లాజ్ 5.5లో పొందుపర్చిందని ఉదహరించారు. ఇప్పుడున్న అగ్రిమెంట్లు, అవార్డుల ప్రకారమే తన ఆపరేషన్ ప్రొటోకాల్ ఉన్నదని నొక్కిచెప్పారు. మైనర్ ఇరిగేషన్లో మిషన్ కాకతీయ వల్ల నేడు కృష్ణా బేసిన్లోనే 10.77 లక్షల ఎకరాల సాగవుతున్నట్టు తెలంగాణ రాష్ట్రం జీవోలు ఇచ్చిందని ఏపీ ప్రశ్నించగా, మైనర్ ఇరిగేషన్ వినియోగాన్ని లెకించడానికి బచావత్ ట్రిబ్యునల్ ఒక పద్ధతిని ప్రవేశపెట్టిందని, దాని ప్రకారంగానే లెకించాలి తప్ప మరో విధంగా కాదని చేతన్ పండిత్ తేల్చి చెప్పారు. ప్రాజెక్టులవారీగా ట్రిబ్యునల్ పంపకాలు చేయలేదని, ట్రిబ్యునల్- 2 ప్రస్తుతం ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నదని పేర్కొన్నారు. ఇక 11వ షెడ్యూల్లోని ప్రాజెక్టులకు ఇచ్చినవి అలకేషన్స్ కావనీ, ఆ షెడ్యూల్ రివర్ మేనేజ్మెంట్ బోర్డుల గైడెన్స్కు మాత్రమే ఉద్దేశించినవని స్పష్టం చేశారు. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేస్తూ చైర్మన్ బ్రిజేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ తరఫున ఇంటర్స్టేట్ వాటర్ బోర్డు ఎస్ఈ కోటేశ్వర్రావు, ఈఈ సల్లా విజయ్కుమార్, సీనియర్ న్యాయవాదులు రామకృష్ణ, రవీందర్రావు, నిఖిల్స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.