న్యూఢిల్లీ : సామాజిక వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది, వీరశైవ మత స్థాపకుడు మహాత్మ బసవేశ్వరుని 889వ జయంతి వేడుకలు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేడ్కర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అధ్యక్షతన జరిగిన ఈ జయంతి వేడుకల్లో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మహాత్మ బసవేశ్వరుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ.. అభ్యుదయవాది, వీరశైవ మత స్థాపకుడు మహాత్మ బసవేశ్వరుని జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సమసమాజ స్థాపనకు పాటు పడిన వారిని స్మరిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో ఒకరని, కుల, మత భేదాలు లేని సమాజ స్థాపనకే అవిరళ కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడని తెలిపారు. మనుషులందరూ ఒక్కటే, కులాలు, ఉపకులాలు లేవన్న మహాత్మ బసవేశ్వరుని ఉపదేశాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మహాత్మ బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందని అలా నడవడమే, మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని ఆయన అన్నారు.