బాసర : నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని ఈ నెల 25న కేతుగ్రహ సూర్యగ్రహణాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని మూసి వేయన్నుట్లు ఈవో సోమయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల్లోగా ఆరాధన, మహా నివేదన పూర్తి చేసి, ఆ తర్వాత అమ్మవారి ఆలయంతో పాటు గోదావరి నది ఒడ్డున గల శివాలయాన్ని కూడా మూసి వేస్తామని పేర్కొన్నారు. తిరిగి సాయంత్రం 7 గంటలకు సంప్రోక్షణ చేసి ఆలయాల ద్వారాలను తెరిచి అమ్మవార్లకు అభిషేకం చేస్తామని తెలిపారు. ఈ నెల 25న అన్ని అర్జిత సేవలు రద్దు చేయడం జరిగిందని, 26న బుధవారం యథావిధిగా అర్జిత సేవలుంటాయని పేర్కొన్నారు.
ఈ నెల 25న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నది. ఈ గ్రహణం పశ్చిమ రష్యా, కజకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో కనిపించనున్నదని తమిళనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ తెలిపింది. అయితే, భారత్లో చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో పాక్షిక గ్రహణాన్ని వీక్షించవచ్చని పేర్కొంది. సూర్యగ్రహణం సాయంత్రం 5.14 గంటలకు ప్రారంభమై.. 5.44 గంటలకు ముగియనున్నది.
రష్యా, కజకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో 80శాతం ద్యశ్యమానత ఉంటుందని, ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక గ్రహణం కనిపిస్తుందని తమిళనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ పేర్కొంది. కంకణాకార గ్రహణాల సమయంలో సూర్యుడిని నేరుగా చూడడం సురక్షితం కాదని, గాగుల్స్ తదితర పరికరాలను వినియోగించి చూడాలని సూచించింది.