బాసర : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 2022-23 విద్యాసంవత్సరం ప్రవేశాలకు ఎంపిక జాబితా విడుదలైంది. మొత్తం 1500 సీట్లకు 33,005 దరఖాస్తులు రాగా 1404 సీట్లతో కూడిన జాబితాను యూనివర్సిటీలో ఇన్చార్జి వీసీ వెంకటరమణ , డైరెక్టర్ సతీశ్కుమార్ సోమవారం విడుదల చేశారు. మిగిలిన 96 సీట్లను స్పోర్ట్స్, పీహెచ్, క్యాప్తో పాటు 105 గ్లోబల్ కేటగిరి సీట్లకు సంబంధించి జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని ఇన్చార్జి వీసీ తెలిపారు. కాగా, మెరిట్ జాబితాలో 99 శాతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఎంపికయ్యారు. ప్రకటించిన 1404 సీట్లలో 10 మంది మాత్రమే ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు. జాబితాను admissions.rgukt.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులకు ఈ నెల 28 నుంచి 30 వరకు పాటు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 28న జాబితాలోని క్రమసంఖ్య 1 నుంచి 500 వరకు మంది విద్యార్థులు, 29న క్రమసంఖ్య 501 నుంచి 1000 వరకు విద్యార్థులు, ఈనెల 30న 1001 నుంచి 1404 క్రమసంఖ్యల విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరు కావాలని ట్రిపుల్ఐటీ అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తులో పొందుపరిచిన సర్టిఫికెట్లతో ఉదయం 9గంటల వరకు ట్రిపుల్ ఐటీ కళాశాలలో హాజరు కావాలని కోరారు. కౌన్సెలింగ్కు హాజరు కాని వారు సీటు కోల్పోతారని వీసీ వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సతీశ్కుమార్, అడ్మిషన్ల కన్వీనర్ సతీశ్, అడ్మిషన్ కమిటీ తదితరులున్నారు.