హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 32 జిల్లా కేంద్రాల్లోని మున్సిపల్ కార్యాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా బర్తన్ బ్యాంకులను ఏర్పాటుచేసింది. ఈ మేరకు హైదరాబాద్ మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో బర్తన్ బ్యాంకులను మెప్మా ఎండీ పమేలా సత్పతి గురువారం ప్రారంభించారు. రాష్ట్ర పురపాలక శాఖ, మెప్మా సంయుక్తంగా ఒక్కో యూనిట్ను రూ.1.75 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ కోసం స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేస్తున్నారు.
వీటి ద్వారా పెండ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించనున్నారు. ఇందులో ఫంక్లన్లు, ఇతర సామూహిక కార్యక్రమాల్లో భోజనాలకు అవసరమయ్యే స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు, స్పూన్లు, జగ్గులు, బకెట్ల వంటివి అందుబాటులో ఉంటాయి. 500 నుంచి 750 మందికి సరిపడా సామగ్రి అందుబాటులో ఉంటుంది. ఇవి మహిళలకు ఉపాధి కల్పిస్తాయని, వీటి ద్వారా పర్యావరణానికి మేలు కలుగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.