హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : బీసీఐ గుర్తింపు లేని వర్సిటీల్లో న్యాయవాద కోర్సులను పూర్తి చేసినా వాటిని పరిగణనలోకి తీసుకోబోమని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ప్రకటించింది. విదేశీ యూనివర్సిటీల్లో చదివే ‘లా’ డిగ్రీ.. భారతీయ వర్సిటీలు జారీ చేసిన ‘లా’ డిగ్రీతో సమా నం కాదని స్పష్టం చేసింది. అయితే, విదేశాల్లో లా అభ్యసించిన మన విద్యార్థులు ఇక్కడ బ్రిడ్జి కోర్సుల ద్వారా పూర్తిస్థాయి ‘లా’ చదివి, బార్ కౌన్సిల్లో నమోదు చేసుకొని, ప్రాక్టీస్ చేసుకోవచ్చని వెల్లడించింది.
ఆయా విద్యార్థులు పట్టాలు పొందిన తర్వాత, మన దేశంలో గోవాలో ఏర్పాటుచేసిన ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ నుంచి మిగతా కాల వ్యవధిని బ్రిడ్జికోర్సు రూపంలో లా పూర్తిచేయాలని బీసీఐ స్పష్టంచేసింది. అనంతరం ఆలిండియా బార్ ఎగ్జామ్ (ఏబీఈ)లో ఉత్తీర్ణత సాధించాలని సూచించింది.