ములుగు : నిషేధిత మావోయిస్టులకు సహాయ, సహకారాలు అందిస్తున్న ముగ్గురు కొరియర్లను ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారివద్ద నుంచి పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సీపీఐ మావోయిస్టులకు ( Banned Maoist)చెందిన అగ్రనాయకులు, దళ సభ్యులు వాజేడు గ్రామంలో రోడ్డు వర్క్ మిషన్లను తగల బెట్టేందుకు వ్యూహం వేశారని పోలీసులకు పక్కా సమాచారం అందింది.
వాహనాలను తగలబెడితే అటుగా వచ్చే పోలీసులను ల్యాండ్మైన్తో చంపివేయడానికి కుట్ర పన్నుతున్నట్లు సమాచారం అందిందని వెంకటపరం సీఐ శివప్రసాద్ తెలిపారు. దీంతో పోలీసు బలగాలతో ఆదివారం రాత్రి వాజేడు నుంచి గుమ్మడిదొడ్డి మార్గంలో ఫుట్ పెట్రోలింగ్ (Petrolling)చేస్తుండగా గ్రామ శివారులో ముగ్గురు అనుమానిత వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే యత్నం చేశారని వివరించారు. వీరిని పోలీసులు పట్టుకుని విచారించగా వారి వద్ద పేలుడు పదార్ధాలు(Explosives) లభించాయని పేర్కొన్నారు.
వాజేడు మండలం ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి నాగరాజు, ఏటూర్ నాగారానికి చెందిన వావిలాల నర్సింగరావు, అదే గ్రామానికి చెందిన ఏంపెల్లి జాషువా అనే ముగ్గురు కొరియర్లను అరెస్టు చేశామని వివరించారు. కొరియర్ల వద్ద నుంచి డిటోనేటర్లను, సెల్ఫోన్లను, విద్యుత్ తీగలు,బ్యాటరీలను, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. వాహనాలను తగుల బెట్టడానికి పెట్రోల్తో పాటు నగదును ఇచ్చిన గుమ్మడిదొడ్డిలోని పెట్రోల్ బంక్ ఓనర్ కంబాలపల్లి గణపతిని కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు.