బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవరూ రూపాయి కట్టొద్దు!. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తం. ఇప్పటివరకు లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. రుణమాఫీ చేశాక బ్యాంకువాళ్లు మళ్లీ లోన్లు ఇస్తరు.
– అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి
Telangana | మెదక్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) :కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ సీఎం అయ్యారు. డిసెంబర్ 9 గడిచిపోయింది. చేస్తామన్న రుణమాఫీ అటకెక్కింది. రైతు మాత్రం సర్కారు సాయానికి దూరమై.. లోనుకు లోకువై.. బ్యాంకుల ముందు తలదించుకునే ఉన్నాడు. మెదక్ జిల్లా కొత్వాల్పల్లిలో రుణాలు చెల్లించలేదని రైతుల్ని ఊరిమధ్యన నిలబెట్టిన దృశ్యం.. కొంచెం అటూ ఇటూగా ఇప్పుడు ప్రతి పల్లెలో కనిపిస్తున్నది.
‘రేవంత్రెడ్డితో మాకు సంబంధం లేదు.. బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలు కట్టాల్సిందే.. ప్రభుత్వం నుంచి ఏవైనా డబ్బులు వస్తే అవి మీకు ఇస్తాం’ అంటూ బ్యాంక్ అధికారులు రైతులతో వాగ్వాదానికి దిగారు. మెదక్ జిల్లా రేగోడ్ ఏపీజీవీబీ అధికారులు రుణాలు తీసుకున్న రైతులకు లీగల్ నోటీసులు అందజేశారు. మూడురోజుల క్రితం కొత్వాల్పల్లి గ్రామానికి వచ్చిన బ్యాంకు అధికారులు గ్రామ నడిబొడ్డున ‘సకాలంలో రుణాలు చెల్లించాలి… బ్యాంక్ మొండి బకాయిలను వెంటనే కట్టాలి’ అనే ప్లకార్డులను పట్టుకొని రైతులపై ఒత్తిడి తెచ్చారు. ‘కాంగ్రెస్ సర్కారు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిందని, ఇప్పుడు మీరు రుణాలు చెల్లించాలంటే ఎలా ? అని రైతులు ప్రశ్నించారు.
బ్యాంకుకు రాజకీయాలకు సంబంధం లేదని, రుణాలు చెల్లించాల్సిందేనని అధికారులు దౌర్జన్యం చేశారు. ‘పంటలు నష్టపోయి..సచ్చిపోయి బతుకుతున్నాం.. ధాన్యం అమ్మిన పైసలొచ్చాక మీ అప్పులు చెల్లిస్తాం’ అని కొత్వాల్పల్లి గ్రామానికి చెందిన రైతులు భాస్కర్ రాజు, నర్సింలు, శంకరప్పలు అధికారులను బతిమిలాడారు. అయినప్పటికీ బ్యాంకు అధికారులు వడ్డీ పైసలు చెల్లిస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని మొండికేశారు. దీంతో రైతులు ‘మీ అప్పు కోసం మేము ఏమన్న తాగి చావాలా..? ఒక్క పైసా కూడా కట్టం.. మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండని కరాఖండిగా చెప్పారు. అంతేకాదు రూ.50 వేలు అప్పు తీసుకుంటే రూ.2 లక్షలు ఎలా అయ్యాయని బ్యాంక్ అధికారులను ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానన్న రేవంత్రెడ్డి వచ్చే వరకు ఒక్క పైసా కూడా చెల్లించేది లేదని రైతులు బ్యాంక్ అధికారులకు స్పష్టం చేశారు.