హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఏడేండ్లలో బ్యాంకు మోసాలు 5 ట్రిలియన్లను అధిగమించాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్లు చేస్తానని 2019 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రవచించిన మాటేమోగానీ, బ్యాంకు మోసాలు అంతకంటే ఎక్కువయ్యాయని ఎద్దేవాచేశారు. దేశంలో బ్యాంకు మోసాల అంశాన్ని సోమవారం 377 నిబంధన కింద లోక్సభలో ప్రస్తావించారు. ఈ బ్యాంకు మోసాలపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారమే 2020-21లో రూ.1.37 లక్షల కోట్ల బ్యాంకు మోసాలు జరిగాయని మండిపడ్డారు.
2021 మార్చినాటికి దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో రూ.4.92 ట్రిలియన్ల మోసాలు జరిగాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బ్యాంకులు ఇస్తున్న రుణాల్లో 4.5 శాతం రుణాలు ఎగవేతదారులకే వెళ్లాయని తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రూ. 2.94 లక్షల కోట్ల మోసాలు జరుగగా, ప్రైవేట్రంగ బ్యాంకుల్లో రూ.86,355 కోట్లుగా నమోదయ్యాయని వివరించారు. ఇప్పటికైనా కేంద్ర ఆర్థికమంత్రి ఈ బ్యాంకు మోసాలపై జోక్యం చేసుకొని శాశ్వత పరిష్కారం కనుగొనాలని, మోసపోయిన సొమ్మును రికవరీ చేయించాలని డిమాండ్ చేశారు.