వరంగల్: వరంగల్ (Warangal) జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గర్భిణిగా ఉన్న బ్యాంకు ఉద్యోగి అనూష (28) బలవన్మరణానికి పాల్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన అనూషకు నాలుగేండ్ల క్రితం వరంగల్ జిల్లాకు చెందిన ప్రవీణ్తో వివాహం అయింది. అనూష.. హనుమకొండలో బ్యాంకులో పనిచేస్తున్నది.
కాగా, మంగళవారం సాయంత్రం అనూష తమతో ఫోన్లో మాట్లాడిందని, అయితే రాత్రి 11 గంటలకు ఆమె ఉరివేసుకుని చనిపోయినట్లు ఫోన్ చేసిచెప్పారని మృతురాలి కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే అదనపు కట్నం కోసం భర్తే ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. వరంగల్ కేయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.