మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్
జమ్మికుంట, జూలై 31: ‘బండి సంజయ్.. ఎంపీగా నువ్వు గెలిచి రెండున్నరేళ్లయ్యింది.. ఇప్పటివరకు నీ పార్టీ ఏం చేసిందో.. నువ్వేం చేశావో జమ్మికుంట, హుజూరాబాద్, కరీంనగర్ ప్రజల ముందుకు వచ్చి చెప్పాలి’ అని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘పత్రికల ముందుకొచ్చి అవాకులు చెవాకులు పేలడం.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం కాదు.. దళితబంధు పథకం ప్రవేశపెడితే కుటుంబానికి రూ.50 లక్షలియ్యమంటావా?.. చెయ్యనోడు ఎన్నైనా చెప్తడు.. చేసెటోనికి తెలుస్తది దాని విలువ.. ప్రాధాన్యత గుర్తించి మాట్లాడాలి. ఎక్కడైనా రూ.2 వేల పింఛన్ ఇచ్చిన మొఖమేనా? మీది’ అని కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి అబద్ధం తప్ప.. నిజం చెప్పే అలవాటు లేదన్నారు. ప్రజలు ఇప్పటికే నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పిన విషయాన్ని బండి సంజయ్కి గుర్తుచేశారు. మాయ మాటలు చెప్పి దుబ్బాకలో గెలిచి ఏం చేశారు..?, ఏం చెప్పి గెలిచారు..?, ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ గెలిస్తే ఏం చేస్తారు.. ఓడితే ఏం చేస్తారో చెప్పాలన్నారు. హుజూరాబాద్ ఉద్యమాల గడ్డ. అన్నీ ఇక్కడి ప్రజలకు తెలుసని, బీజేపీకి తప్పక గుణపాఠం చెబుతారని మంత్రి స్పష్టం చేశారు.