గద్వాల, ఏప్రిల్ 15: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ది తొండి యాత్ర అని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకుల యాత్రకు ప్రజల్లో స్పందన లేదని, కమలం పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. పాదయాత్ర అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, కానీ, బీజేపీ నేతలు ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ర్టానికి ఏం ఒరగబెట్టారని కమలం పార్టీ నేతలు పాదయాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
గద్వాల నడిగడ్డ ప్రాంతం గురించి బండికి ఏం తెలుసని ప్రశ్నించారు. దమ్ముంటే జోగుళాంబ బ్యారేజ్కు జాతీయ హోదా ఇప్పిస్తామని యాత్రలో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాకు నీళ్లు ఇవ్వడానికి నాడు హారతులు పట్టి సంబురపడిన మీరు పాదయాత్ర చేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతులు అధోగతి పాలు కావాల్సిందేనని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహాం, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.