Shankar Goud | (నూర శ్రీనివాస్)/వరంగల్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అమానవీయం.. దారుణం. ఆత్మబలిదానం చేసుకున్న నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్కు నివాళులర్పించే ముసుగులో బీజేపీ నేతలు అమర్యాదగా ప్రవర్తించిన తీరు అత్యంత హేయం. ఎవరైనా చనిపోతే సంప్రదాయబద్ధంగా అంతిమ వీడ్కోలు పలికేటప్పుడు ఇంటి నుంచి శ్మశానం వరకు నలుగురు మనుషులు చేరి తమ భుజాలపై మోసి అభిమానం చాటుకోవడం ఆనవాయితీ.
ఇంటి నుంచి బయల్దేరినప్పటి నుంచి ముఖంపై ఎండ, వాన నుంచి పశుపక్ష్యాదుల నుంచి రక్షణ కోసం గొడుగు పడుతూ చివరి చితికి నిప్పు పెట్టే తంతు దాకా పూర్తి గౌరవప్రదంగా సాగనంపుతారు. అలాంటిది ఆర్టీసీ డ్రైవరన్న శంకర్గౌడ్ మృతదేహం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆయన అనుచరగణం వ్యవహరించిన తీరు.. అమరుడి ఆత్మక్షోభించిందో! ఎంత తల్లడిల్లిందో!! నివాళి పేరుతో ‘బండి’ చేసిన శవరాజకీయం అందరినీ ఆగ్రహానికి గురిచేసింది.
కుటుంబ సభ్యులు, బంధువులు, సహచర ఆర్టీసీ కార్మికులు, పట్టణవాసులు, పోలీసులు ఇలా అందరూ చూస్తుండగానే మృతదేహాన్ని గొరగొరా ఈడ్చుకెళ్లిన తీరు అందరినీ కలచివేసింది. ఆ దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరూ గద్దగ స్వరంతో ‘అయ్యో బిడ్డా!’ అని కన్నీటిపర్యంతం అయ్యారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ముత్తోజిపేటలో చోటుచేసుకున్న ఈ పరిణామం స్థానికంగా అక్కడున్నవాళ్లకే కాదు, ఆ దృశ్యాలు వివిధ మాధ్యమాలలో చూసిన వారు కన్నీటిపర్యంతమ్యారు.

ఒంటిపై పెట్రోల్ పోసుకొని అందరూ చూస్తుండగానే నిప్పంటించుకొని డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మబలిదానం అయ్యారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. మృతదేహాన్ని పోలీసు పహారా నడుమ హైదరాబాద్ నుంచి నర్సంపేటకు తీసుకొచ్చారు. సహచర కార్మికులు తమ ఆత్మీయుడి మృతదేహాన్ని డిపో వద్దకు తరలించాలని పోలీసులను ప్రాధేయపడ్డారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, కార్మిక, ప్రజాసంఘాల ప్రతినిధులు సైతం వారి విజ్ఞప్తిని మన్నించాలని వేడుకున్నా ప్రభుత్వం ఒప్పుకోదని పోలీసులు నిరాకరించారు. శాంతియుతంగానే తాము శంకర్గౌడ్కు నివాళులు అర్పిస్తామని కార్మికులు వాగ్దానం చేశారు.

తాము అసలు డిపో దగ్గరికే రామని బీఆర్ఎస్ స్పష్టమైన హామీ ఇచ్చింది. అయినా కాంగ్రెస్ సర్కార్ తాను ఎక్కిన కాఠిన్యం మెట్టు దిగలేదు. ఇంటిచుట్టూ పోలీసుగస్తీ తన మృతదేహానికి కాపాలాగా ఉంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు, ఆత్మీయులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఇలా అందరూ మృతదేహం చుట్టే గుమిగూడి ఉన్నారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ శ్రేణులు పంతానికి పోయారు.
నివాళులు అర్పించినట్టే అర్పించి శంకర్గౌడ్ మృతదేహాన్ని తమ రాజకీయ వస్తువులా ఎంచుకున్నారు. ఫ్రీజర్లో 80శాతం కాలిన మృతదేహాన్ని 43 డిగ్రీల మాడుపగిలే ఎండలో గొరగొరా గుంజుకుపోయారు. ఇంటిముందర వేసిన టెంట్ నుంచి అంద రూ చూస్తుండగానే దాయాదుల ఆస్తి తగాదాల్లో ఒక వస్తువులా శంకర్గౌడ్ మృతదేహాన్ని రెండు మూడు వందల మీటర్ల వరకు ఎత్తుకెళ్లి అమర్యాదగా ప్రవర్తించారు. కమురు వాసన కొడుతున్నా తన మృతదేహాన్ని కాల్చిన దానికంటే తీవ్ర ఎండకు తనువును కాల్చివేస్తుంటే అమరుడు ఎంత విలవిల్లాడాడో! శం కర్గౌడ్ మృతదేహంపై బీజేపీ నాయకులు కనికరం లేకుండా ప్రవర్తించినందుకు ఎంత క్షోభించిందో.