మాదాపూర్ : తెలంగాణలో బీజేపికి రోజురోజుకు ఆదరణ తగ్గడం తట్టుకోలేక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి( MP Ranjith Reddy) అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)పై అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాదాపూర్లోని సాయి నగర్ కాలనీలో ధర్నా చేపట్టారు. అనంతరం పార్టీ మహిళలు బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేసి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని , పోలీసులు అతడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీకీ ఆదరణ తగ్గడంతో బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలతో రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. కేంద్ర సహకారం ఉంది కదా అని నోటికొచ్చింది మాట్లాడితే చూస్తు ఊరుకోబోమని హెచ్చరించారు. బండి సంజయ్ను గుజరాత్ నుంచి వచ్చి ఎవరు కాపాడరని చివరకు తెలంగాణే దిక్కు అని మర్చిపోవద్దని అన్నారు.
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడమే లక్ష్యంగా బండి సంజయ్ పనిచేస్తున్నారని విమర్శించారు. నోరును అదుపులో ఉంచుకోకపోతే తెలంగాణలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్లతో పాటు పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.