కరీంనగర్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): అది కరీంనగర్.. గురువారం, మధ్యాహ్న సమయం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాసం.. తన యాత్రను ప్రభుత్వం ఆపినందుకు నిరసనగా అంటూ సంజయ్ అక్కడ ఉదయం 11 నుంచి 1 వరకు రెండు గంటల దీక్ష చేపట్టారు. ఆయన పక్కన ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్తో పాటు పలువురు బీజేపీ నేతలు కూర్చొని ఉన్నారు. వెనక నుంచి పార్టీ కార్యకర్తల నినాదాలు వినిపిస్తున్నాయి. సంజయ్కి కుడి పక్కనే శ్రవణ్ కూర్చున్నారు. కొంచం సేపు వాళ్లిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. అదేమిటో మైకుకు చిక్కలేదు. కొద్ది సేపటికి సంజయ్ కుడివైపునకు తిరిగి, తలను శ్రవణ్కు దగ్గరగా పెట్టి ‘హైదరాబాద్ పోతున్నా..’ అన్నారు. మరికొంత సంభాషణ తర్వాత.. సంజయ్ నోట ‘మత ఘర్షణలు..’ అనే మాట వినిపించింది. ఇది మైకులో స్పష్టంగా రికార్డు అయ్యింది.
అంతకుముందు సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్పై నిందలు వేశారు. రాష్ట్రంలో మతఘర్షణలు సృష్టించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన నిరాధార ఆరోపణలు చేశారు. ‘రెండు రోజుల్లో మత ఘర్షణలు చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు పన్నిండు. వంద శాతం నిజం ఇది. లిక్కర్ దందా ఆరోపణల నుంచి దృష్టి మళ్లించేందుకు మత ఘర్షణలు సృష్టించేందుకు కేసీఆర్, ఆయన కుటుంబం మజ్లిస్తో కలిసి కుట్ర చేస్తున్నరు. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి లేదు. ఏదో ఒకటి చేయాలి.. ప్రజల దృష్టిని మళ్లించాలె అనేది కేసీఆర్ ఆలోచన’ అని సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి తను పరిపాలిస్తున్న రాష్ట్రంలో తానే శాంతి భద్రతల సమస్య సృష్టించుకుంటాడా.. అది ఆయనకే నష్టదాయకం కదా! అనే ఇంగితం లేకుండా ఎంపీగా ఉన్న సంజయ్ ఆరోపణలు చేయడం పట్ల పరిశీలకుల్లో విస్మయం వ్యక్తమవుతున్నది. కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకుల వ్యవహార శైలి వల్ల మత విద్వేషాలు చెలరేగుతాయని, దాంతో శాంతి భద్రతలు సమస్యల ఏర్పడుతుందని దీని వల్ల హైదరాబాద్ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. దీనిపై ప్రజలను అప్రమత్తం కూడా చేస్తున్నారు. అసలు హైదరాబాద్లో సమస్యకు ప్రధాన కారణం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు. ఇవి ఒక సామాజిక వర్గాన్ని నొప్పించడంతో సమస్య ఉత్పన్నమైంది.
రాజాసింగ్ తప్పుపని చేశాడని అంగీకరించిన బీజేపీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ఈ వాస్తవాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్పై అబద్ధాల ప్రచారానికి తెగబడ్డారు. ‘మత ఘర్షణలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కనసన్నల్లో ప్రయ త్నం జరుగుతున్నది. ఎంఐఎం గుండాలను నిలువరించే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం లేదు. పోలీసుల చేతులు కట్టేశారు. ముఖ్యమంత్రి కుటుంబమే శాంతి భద్రతల సమస్యగా మారింది. సీఎం కుటుంబమే ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నది. రాత్రి పూట రాడ్లు పట్టుకోండి.. రాళ్లు పట్టుకోండి, కోడి గుడ్లు పట్టుకోండి బీజేపీ వాళ్లపై దాడులు చేయండి, శాంతి భద్రతల సమస్య తలెత్తాలి.. ప్రభుత్వం ఉంటే ఉంటుంది.. పోతే పోతుంది. కానీ మా కుటుంబం జోలికి ఎవరైనా వస్తే ఇట్ల చేస్తమని నిరూపించాలని కేసీఆర్ కుటుంబం బరితెగించి ప్రజాసామ్యాన్ని అపహాస్యం పాలుచేసే విధంగా వ్యవహరిస్తున్నది.’ అంటూ బండి సంజయ్ నోటికొచ్చినట్లు అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు. మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలపై కొన్ని వర్గాల నిరసనతో హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. ఇది అర్ధరాత్రి దాకా కొనసాగింది. పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు అధికారులతో మూడు గంటల పాటు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వ్యాఖ్యలపై నజర్
కొద్దిరోజులుగా రాష్ట్ర బీజేపీ నేతల ధోరణి, మొన్న రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు, ఇవాళ బండి సంజయ్ వ్యాఖ్యలను పోలీసు ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది.