రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): మహిళలను ఉద్దేశించి కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘మీరు బ్యూటిఫుల్గా తయారైపోతే, మీ ఓట్లు అవతల పార్టీ వాళ్లు వేసుకుంటారు’ అని వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘ఈ నెల 11న ఎలక్షన్లు ఉన్నయి.. మహిళలంతా బీజేపీకి ఓటెయ్యాలె.. మీరు బ్యూటిఫుల్గా తయారై పోతే.. మీ ఓట్లు అవతల పార్టీ వాళ్లు వేసుకుంటరు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు పైసలిస్తే తీసుకోవాలని, ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరి గాంధీభవన్లో సంసారం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం వేములవాడ సభలో మాట్లాడుతూ.. తమ వాళ్ల జోలికి రావద్దంటూ పోలీసులను హెచ్చరించారు. ‘మావోళ్లను ఇబ్బందులు పెడితే ఇక్కడ వచ్చి నేనే కూర్చుంటా.. మీ డీజీపీ రావాల్సి ఉంటుంద’ని పేర్కొన్నారు.