ఇలా రెండు రకాలుగా వ్యాఖ్యలు చేయటం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కే చెల్లింది. గురువారం వేములవాడలో బండి మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలపై స్పందించారు. అధికారులు తనిఖీ చేస్తే సహకరించాలని, నిజాయితీని నిరూపించుకోవాలని, దర్యాప్తు సంస్థలపై రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇదే బండి సంజయ్.. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్కు సిట్ నోటీసులు జారీచేస్తే అడ్డగోలుగా విమర్శించారు. రోజుల కిందట హైదరాబాద్లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘బీఎల్ సంతోష్పైనే కేసులు పెడతారా..ఖబడ్దార్. కావాలనే ఇరికిస్తున్నరు. ఆయన జోలికి వస్తే ఊరుకోం. ఎవరో చెప్తే కేసులు పెడతారా?’ అంటూ వ్యాఖ్యానించారు. గురువారం బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీఎల్ సంతోష్కు సిట్ ఇచ్చిన నోటీసులపై న్యాయపరంగా వెళ్తామని అన్నారు.
బండి, లక్ష్మణ్ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి విషయంలో నీతి నిరూపించుకోవాలని, సహకరించాలని చెప్పిన బండి సంజయ్.. బీఎల్ సంతోష్ను సిట్ ఎదుట హాజరు కావాలని ఎందుకు సూచించడం లేదని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు సంస్థలను విమర్శించొద్దన్న నోటితోనే, ఖబడ్దార్ అంటూ హెచ్చరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మీకో నీతి.. పరులకో నీతా? అంటూ టీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నారు. బీఎల్ సంతోష్ దొరికిపోతే తమ పరిస్థితి తలకిందులు అవుతుందనే బాధతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– హైదరాబాద్, నమస్తే తెలంగాణ