సీఎంను విమర్శిస్తే గట్టిగా బదులిస్తాం
మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పల్లా
హనుమకొండ, ఫిబ్రవరి 14: కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు సంస్కరణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కనీస అవగాహన లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, ఆరూరి రమేశ్ విమర్శించారు. సోమవారం హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ విద్యుత్తుపై సంజయ్ది జీరో నాలెడ్జ్ అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రెట్టింపు శక్తితో బదులిస్తామని హెచ్చరించారు. సైనిక అమరులను కీర్తించింది, గౌరివించింది, ఆర్థికంగా ఆదుకున్నది తెలంగాణ రాష్ట్రమేనని గుర్తుచేశారు. బీజేపీ సెంటిమెంట్ ఆటలు తెలంగాణలో సాగవని స్పష్టంచేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం జరిగిన పరిణామాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తెలంగాణపై బీజేపీ విషం చిమ్ముతున్నదని విమర్శించారు.