హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఒకాయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లలో తనకుగానీ, బీజేపీకి గానీ సంబంధం లేదని తడిబట్టలతో తెలంగాణ దేవుడు యాదాద్రి నరసింహుడి దగ్గర ప్రమాణం చేస్తడు. ఆయన ఇంటిముందలి ఇంటాయన.. పైగా ఎప్పుడూ ఆయన ఇంట్లోనే ఉండేటాయన మాత్రం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తనవంతు ‘పని’ చేస్తడు. ప్రధాన నిందితుడు సింహయాజికి విమానం టికెట్ బుక్చేస్తడు.. ఒకే గదిలో కలిసి ఉంటడు.. చర్చలు చేస్తడు. ప్రమాణం చేసినాయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన తరఫున పనులన్నీ చక్కబెట్టినట్టు తెలుస్తున్నది.. లాయర్ శ్రీనివాస్! సిట్ దర్యాప్తు అధికారులు నిర్వహిస్తున్న విచారణ, కాల్ డాటా విశ్లేషణలో బండికి, లాయర్ శ్రీనివాస్కు మధ్య ఉన్న విడదీయరాని అనుబంధం బయటకు వచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడుగా ఉన్న సింహయాజికి, లాయర్ శ్రీనివాస్కు మధ్య లింకుల డొంక కూడా కదిలింది. ఈ శ్రీనివాస్ అనే న్యాయవాది కరీంనగర్లో బండి సంజయ్ ఇంటికి ఎదురుగా నివాసముంటడు.
కానీ 24 గంటలు బండి ఇంట్లోనే గడుపుతడు. అంతే కాదు.. ఇద్దరి మధ్యన బావా అని పిలుచుకొనే సాన్నిహిత్యం కూడా ఉన్నదని సిట్ విచారణలో తేలినట్టు సమాచారం. ఇతను ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ.. బండి సంజయ్ ఇంట్లోనే బసచేస్తడు. ఇద్దరి మధ్యన ఉన్న బంధం అలాంటిది. బీజేపీ నేతలు ఏ దశలో కూడా ప్రత్యక్షంగా కనిపించకుండా.. సన్నిహితులతోనే వ్యవహారాలు నడిపించారనడానికి ఈ లాయర్ శ్రీనివాస్ తిరుగులేని ఉదాహరణ అని అధికారులు అంటున్నారు. దళారులకు కావాల్సినవన్నీ శ్రీనివాసే చేసిపెట్టాడని తెలిసింది. అక్టోబర్ 26న సింహయాజి తిరుపతి నుంచి హైదరాబాద్ రావటానికి టిక్కెట్ బుక్ చేసింది ఈ శ్రీనివాసే. అంతకుముందు శ్రీనివాస్, నందు అనేకసార్లు మాట్లాడుకొన్నారు. ఇద్దరి మధ్యన గంటలకొద్దీ సుదీర్ఘమైన సంప్రదింపులు జరిగినట్టు కాల్డాటాలో వెలుగు చూసినట్టు సమాచారం.
అంతే కాదు.. అక్టోబర్ 14-15 తేదీలలో నందు, సింహయాజి, శ్రీనివాస్.. ఈ ముగ్గురూ ఢిల్లీలో కలిసే ఉన్నారని, చర్చలు జరిపారని తెలిసింది. వీళ్ల మధ్యన జరిగిన ఫోన్ సంభాషణలు, టెక్స్ సందేశాలు సిట్ చేతిలో ఉన్నాయని సమాచారం. బండికి తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా శ్రీనివాస్ ఈ వ్యవహారంలో చొరవ తీసుకొంటాడని భావించే అవకాశం లేదని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. పైగా కేసు వెలుగు చూసినప్పటి నుంచి శ్రీనివాస్ పరారీలో ఉన్నాడని, కోర్టుకు కూడా హాజరు కావడం లేదని తెలుస్తున్నది. ఈ మొత్తం వ్యవహారంలో శ్రీనివాస్ పాత్ర స్పష్టమని.. త్వరలోనే అరెస్టు కాక తప్పదని దర్యాప్తు అధికారులు అంటున్నారు. శ్రీనివాస్ నివాసంలో త్వరలో సోదాలు కూడా నిర్వహించేందుకు సిట్ అధికారులు సన్నద్ధమైనట్టు సమాచారం.
ఎంత మోసం బండీ..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడిన వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఊహించని వేగంగా స్పందించారు. ఈ అంశంతో తమకు ఏ విధంగానూ సంబంధం లేదని నమ్మించడానికి నానా పాట్లు పడ్డారు. రాజకీయ డ్రామాలను రసవత్తరంగా పండించడంలో సహజంగానే సిద్ధహస్తుడైన బండి సంజయ్.. అత్యుత్సాహంతో.. తెలంగాణ ఇలవేలుపు అయిన యాదాద్రి నరసింహస్వామి పైనే ప్రమాణం చేస్తానన్నారు. యాదాద్రికి వెళ్లి మరీ.. తడి బట్టలతో స్వామి దగ్గర.. ఈ అంశంతో తనకు.. తన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేసి వచ్చారు. ఇప్పుడు ఒక్కో వ్యవహారం బయటపడుతుంటే.. బండి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఆయనకు అత్యంత సన్నిహితుడి పాత్రే ఈ వ్యవహారంలో బయటపడటంతో కిక్కురుమనే పరిస్థితి కూడా లేకుండాపోయింది. మరి నర్సింహస్వామి అంటే మామూలా.. ఆయనతో గేమ్ ఆడితే ఊరుకుంటడా..!