బాధ్యతారహితంగా మాట్లాడితే ఊరుకోం
వ్యవసాయ రంగాన్ని కాపాడుకుంటాం
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
ఖమ్మం, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి బీజేపీ నేత బండి సంజయ్కి ఏం తెలుసని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాదయాత్రల పేరుతో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకొంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘వానకాలం సాగు-2022’ పై ఖ మ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతుబంధు సమితి సభ్యు లు, ప్రజాప్రతినిధులకు గురువారం ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి మంత్రి నిరంజన్రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సింగిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ పాలించే ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తం బడ్జెట్ కేటాయించిన దాఖలాలు లేవన్నారు.వ్యవసాయంలో ఖమ్మం జిల్లా ముందు వరుసలో ఉన్నదని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. వానకాలం సీజన్ కంటే ముందే అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి పంటల సాగులో అవలంబించాల్సిన పద్ధతులపై రైతులను చైతన్యవంతులను చేయడం సంతోషదాయకమన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇక్కడ అమలవుతున్న పథకాల కోసం పొరుగు రాష్ర్టాలు సైతం తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు.