కరీంనగర్ రాంనగర్/వేములవాడ టౌన్, డిసెంబర్ 14: దేశంలో దేవుడిని అడ్డం పెట్టుకొని కొందరు రాజకీయ ప్రచారం చేస్తున్నారని, ఈ విషయాన్ని తాము ప్రశ్నిస్తే హిందువులకు వ్యతిరేకమంటున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి దర్శించుకొని కోడెమొక్కు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
ఆయా సందర్భాల్లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేవుడు తమకే సొంతం అన్నట్టుగా కొందరి వ్యవహారం ఉన్నదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాన్ని ఆదరాబాదరాగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. హిందూత్వను విశ్వసించే ప్రతిఒక్కరూ ఈ విషయంపై ఆలోచన చేయాలని కోరారు. అయోధ్య రామాలయం ప్రారంభం ఎన్నికల స్టంటేనని, రాముడి కటౌట్లు పెట్టుకొని ఓట్లు అడిగేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. జగద్గురువులు చెప్పినా వినకుండా అశాస్త్రీయంగా ఆలయ ప్రారంభోత్సవాన్ని చేయాలనుకోవడం సరికాదని హితవు చెప్పారు.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించడం అర్థరహితమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు జ్యోతిష్కుడి మాదిరిగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే, తమ పార్టీ ఎమ్మెల్యేలను ముట్టుకొనే ధైర్యం ఎవరూ చేయలేరని పేర్కొన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ఆరోపించారు. వైఫల్యం చెందిన ఎంపీల్లో బండి సంజయ్ దేశంలోనే నంబర్ వన్ అని విమర్శించారు. మాజీ ఎంపీ వినోద్కుమార్ కరీంనగర్కు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉంటే ఆరు గ్యారెంటీలతోపాటు పేదల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందని చెప్పారు.