హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు స్వామిజీలు యత్నించి దొరికినా, ఆ పార్టీ నేతల బడాయికి అడ్డూఅదుపులేకుండా పోయింది. ప్రలోభాల కుట్ర విఫలం కావడంతో బీజేపీ నేతలు నోటికి పదును పెట్టారు. ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్న చందంగా వారే ఎదురుదాడులకు దిగుతున్నారు. అడ్డంగా దొరికినా… చేసింది తప్పుకాదు, ముఖ్యమంత్రే చేశారంటూ తప్పించుకొనే యత్నాలు ప్రారంభించారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తులు బీజేపీ నేతలకు సన్నిహితులని.. సాక్ష్యాలు ఉండగా పోలీసులకు పట్టుబడిన వారెవరో తమకు తెలియదన్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాటమార్చారు. ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన వారిని ఫామ్హౌస్లో పట్టుకొన్న పోలీసులు అక్కడికెందుకు వెళ్లారని సంజయ్ ఎదురు ప్రశ్నించడం గమనార్హం. కుట్రను అడ్డుకొన్న పోలీసులను డ్రామా కంపె నీ అంటూ అవహేళన చేశారు. పోలీసులు ఇలా నే చేస్తే బీజేపీ కార్యకర్తలతో ఉరికిచ్చి కొడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కొనుగోలు చేసేందుకు వచ్చినవాళ్లు బీజేపీ వాళ్లు కాదు.. సీఎం ఢిల్లీలో కుట్రచేసి వారితో నాటకమాడిస్తున్నారని బండి తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు.