కుత్బుల్లాపూర్, మే10: పోక్సో కేసు విషయంలో స్పందించి కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని, ఈ కేసులో నిందితుడైన ఆయన కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు డిమాండ్ చేశారు. ఒక మైనర్పై బండి భగీరథ్ అరాచకాలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి మూడు రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ను బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు ముట్టడించారు. ఈ నిరసనలో మహిళా నాయకురాళ్లు పావని, స్రవంతి, సునీత, శైలజ, మంజుల, అరుణారెడ్డి, ఇంద్రారెడ్డి, పద్మ, ఫర్జానా, హేమలత, లావణ్య, పార్వతి, కరీమా, కవితతోపాటు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లిన మహిళలు పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించి కేంద్ర మంత్రి బండి సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అధికార బలం చూసుకొని నిందితుడిని కాపాడుతున్నారా? అంటూ పోలీసులను ప్రశ్నించారు. బండి భగీరథ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తన కుమారుడు ఇంతటి ఘోరానికి పాల్పడినా బండి సంజయ్ మౌనంగా ఉండటం సిగ్గుచేటని, ఆయన వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. కేసు నమోదై 72 గంటలు దాటినా నిందితుడిని కనీసం విచారణకు పిలువకపోవడం వెనుక పోలీసులపై ఒత్తిడి ఉన్నదని ఆరోపించారు. మోదీ పాలనలో ఆడపిల్లల కుటుంబాలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలన సృష్టించిన ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆయన జోక్యం చేసుకొని నిష్పక్షపాత వి చారణ జరిపించాలని డిమాండ్ చేశారు.