హైదరాబాద్ : సనత్నగర్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ ( Balkampet Yellamma ) ఆలయం తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) హయాంలోనే ఎంతగానో అభివృద్ధి చెందిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) తెలిపారు.
గురువారం ఆయన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పండితులు ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఆవరణలో చేనేత సంఘం ఆధ్వర్యంలో 21 వ తేదీన కళ్యాణం సందర్భంగా అమ్మవారికి సమర్పించనున్న చీరను మగ్గంపై తయారు చేసే పనులను శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత కళాకారులను అభినందించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరు ఊహించని స్థాయిలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, పరిసర ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. 2014 కు ముందు అమ్మవారి కళ్యాణాన్ని ఆలయం లోపల నిర్వహించేవారని, 15 నుంచి 20 వేల మంది భక్తులు వచ్చేవారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ ట్రస్టీ సాయిబాబా గౌడ్, సనత్ నగర్, అమీర్ పేట డివిజన్ ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, రాజేష్ ముదిరాజ్, రమేష్ గౌడ్, కూతురు నర్సింహ, కట్టా బలరాం, వనం శ్రీనివాస్, సుమిత్ సింగ్, గోపీలాల్ చౌహన్, అఖిల భారత చేనేత కళావైభవం సభ్యులు జయరాజ్, భద్రయ్య, రాజేష్, లక్ష్మయ్య, బాలకృష్ణ, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.