మంచిర్యాల : చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించి.. పది సంవత్సరాలు పరిపాలించిన గొప్ప వ్యక్తి కేసీఆర్. తండ్రి లాంటి కేసీఆర్పై చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్(Vivek) అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) తెలిపారు. బుధవారం మంచిర్యాల బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే దివాకర్ స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను ఏకోన్ముఖంగా ఒక తాటిపై తీసుకువచ్చి 1969లో సాధ్యం కాని తెలంగాణను ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ సాధించారు.
వివేక్కి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఆయన తండ్రి వెంకటస్వామి మరణించినప్పుడు వారి మృతదేహాన్ని గాంధీభవన్కి కూడా తీసుకురాకుండా అవమానించారు. కానీ, సీఎం కేసీఆర్ వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించడమే కాకుండా ఆయన జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తిని దూషించడానికి వివేక్ నోరెలా వచ్చిందని మండిపడ్డారు. సోషల్ మీడియాలో కేసీఆర్పై, నాపై అడ్డగోలుగా విమర్శిస్తున్నారు. ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో మాపై దుష్ప్రచారం చేస్తున్నారు.
అయినా మేము సమన్వయం పాటిస్తున్నామని చెప్పారు. వివేక్, అతని కుటుంబ సభ్యులు, ఆయన సొంత మీడియాలో అడ్డగోలుగా ఆరోపణలు చేసినా సహిస్తున్నాం. దయచేసి వీటిని ప్రజలు గమనించాలన్నారు. ఆవుల మందమీద తోడేలు గుంపు పడ్డట్టు విశాఖ ఇండస్ట్రీకి చెందిన ఉద్యోగులు, ఆయన మీడియా సంస్థలకు చెందిన ఉద్యోగులు మాపై విరుచుకుపడుతున్నారు. నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా డబ్బు సంచులతో, నోట్ల కట్టలతో మా లీడర్లను కొంటున్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి ధన రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
దొంగే దొంగ చందంగా వివేక్ పద్ధతి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆర్టీజీఎస్ ద్వారా విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు రూ. 8 కోట్లు బదిలీ చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నిజంగా తప్పు చేయకపోతే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. వచ్చే ఒకటి రెండు రోజుల్లో లీడర్ల కొనుగోలు వ్యవహారాన్ని ప్రజాక్షేత్రంలో ఉంచుతామన్నారు. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. దయచేసి చెన్నురు నియోజకవర్గ ప్రజలు వివేక్ ధన రాజకీయాలను తెప్పి కొట్టి కారు గుర్తుకే ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు.