హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): భూకబ్జాలకు పాల్పడిన ఈటల రాజేందర్ తన తప్పును ఒప్పుకొని ముక్కు నేలకురాసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్చేశారు. ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని ఈటల చెప్పిన మాటలు పచ్చి అబద్దాలని మెదక్ జిల్లా కలెక్టర్ చేసిన విచారణలో తేటతెల్లమైందని పేర్కొన్నారు. కబ్జాచేసిన భూములను ఈటల వెంటనే వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్కు చెందిన జమున హేచరీస్పై మెదక్ కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి 70.33 ఎకరాల అసైన్డ్ భూమిని కాజేశారని తేల్చారని చెప్పారు. హకీంపేట, అచ్చంపేట గ్రామాల పరిధిలో ఇంకా 579 ఎకరాల భూమి కబ్జాకు గురైందని, అందులో 200-300 ఎకరాలు ఈటల కాజేశారని వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. నిజాయితీగా విచారణ చేసి కబ్జాను నిగ్గుతేల్చిన కలెక్టర్పై ఈటల అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, కలెక్టర్ను భయపెట్టాలని చూస్తే ప్రభుత్వం కఠినంగా వ్యహరిస్తుందని హెచ్చరించారు. బీజేపీ ఎంపీ అర్వింద్ పిచ్చికూతలు కూస్తున్నారని, ఆయన అసలు మనిషేనా అని మండిపడ్డారు. రేవంత్రెడ్డిలాంటి దొంగలకు మంత్రి కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కులేదని స్పష్టంచేశారు. టీఎస్స్పీఎస్సీ మాజీ సభ్యులు విఠల్ వ్యాఖ్యలపై స్పందించారు. పదవులిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిది.. ఇవ్వకపోతే చెడ్డదా? అని ప్రశ్నించారు.
ఈటలను బీజేపీ సస్పెండ్ చేయాలి: ఎమ్మెల్సీ సతీశ్
ఈటల రాజేందర్పై వచ్చిన అవినీతి, అక్రమాలు, భూ కబ్జా ఆరోపణలు నిజమని తేలినందున, బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ డిమాండ్చేశారు. గుంట భూమి కబ్జా చేసినా ముక్కు నేలకు రాస్తానన్న ఈటల, 70.33 ఎకరాలు కబ్జా చేశారని తేలినందున హుజూరాబాద్ చౌరస్తాలో 71 సార్లు ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ మంత్రిగా పనిచేసి, చట్టం తెలిసి కూడా తప్పుచేసి, ఆపై బుకాయించటం దుర్మార్గమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ విమర్శించారు. తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు.