Minister Dayakar Rao | స్వచ్ఛంద సంస్థలకు బాల వికాస ఆదర్శమని, సామాజిక సేవలో సంస్థ నెంబర్ వన్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశంసించారు. బాల వికాస సమాజ అభివృద్ధి పథకాల నాయకుల జాతీయ స్థాయి మహాసభ కీసరగుట్టలో జరిగింది. కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 40 సంవత్సరాల నుంచి సంస్థతో తనకు అనుబంధం ఉందన్నారు. బాలవికాస సేవల్లో తాను పాల్గొన్నాన్నారు. సంస్థ వ్యవస్థాకురాలు బాల థెరీసా సింగారెడ్డి (బాలక్క) వర్ధన్నపేట, రెడ్డిపాలెంలో పుట్టి కెనడాకు వెళ్లి ఆండ్రే జింగ్రాస్ను వివాహమాడి, ఆయన ద్వారా ఇక్కడ స్వచ్ఛంద, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రసంశించారు.
గత 40 ఏళ్లుగా బాల వికాస ద్వారా ఎలాంటి అభివృద్ది జరిగింది అని సమీక్ష చేసుకోవాలని, 40 ఏళ్ల కింద మహిళలు బయటకు రావాలంటే భయపడేదని, మహిళల్లో చైతన్యం కల్పించి , సంఘాలు పెట్టి ఆర్థిక చేయూత నివ్వడం ద్వారా వారికి ఆత్మ విశ్వాసం పెంచారన్నారు. గ్రామాల్లో బోర్లలో నీళ్లు రాకపోతే బాలవికాస సంస్థ 1500కిపైగా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిందన్నారు. బాల వికాస సేవలు ఆదర్శనీయమని, స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడంలో సంస్థ నెంబర్ వన్ అని అన్నారు. మనకు శిక్షణ ఇచ్చి, నాయకత్వ లక్షణాలు పెంచి, సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేశారన్నారు. మన ఊరు మన బడి ద్వారా సీఎం కేసీఆర్ పాఠశాలలను బాగు చేస్తున్నారన్నారు.
గంగదేవిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దింది బాల వికాస సంస్థేనని, దేశంలో గొప్పగ్రామంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని గ్రామాలను గంగదేవిపల్లెలా తయారు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో తడి, పొడి చెత్త వేరు చేసి ఆదాయం తీసుకొస్తున్నామని, వైకుంఠధామాలు నిర్మించామని, దేశంలో 20 ఉత్తమ గ్రామాలు ఎంపిక చేసి అవార్డులు ఇస్తే 19 తెలంగాణకు వచ్చాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మి, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరెడ్డి సింగారెడ్డి, ఇతర ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.