ఖైరతాబాద్, మార్చి 19: మన శరీరంలో ఇన్సులిన్ సమతుల్యత దెబ్బతినడం వల్లే రోగాలు చుట్టుముడతాయని నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో ‘దీర్ఘకాలిక వ్యాధులు-ఆహార నియమాలు’ అనే అంశంపై ఆయన అవగాహన కల్పించారు. స్థూలకాయంతో పాటు వివిధ రకాల జబ్బులకు ప్రధాన కారణం ఆహార నియమాలను పాటించకపోడమేనని స్పష్టం చేశారు.
ప్రపంచంలో స్థూలకాయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నదని, దీని వల్లనే మధుమేహం, రక్తపోటు (బీపీ), క్యాన్సర్ లాంటి సమస్యలు అధికమవుతున్నాయని వివరించారు. 2025 నాటికి ప్రపంచంలో బీపీ రోగుల సంఖ్య 150 కోట్లకు పెరుగుతుందని, 42.27 కోట్ల మంది గుండె జబ్బుల బారిన పడతారని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో గుండెపోటుతో ప్రతి 36 సెకన్లకు ఒకరు చొప్పున చనిపోతున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 42.50 కోట్ల మంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారని, 2045 నాటికి ఈ సంఖ్య 62.90 కోట్లకు పెరుగుతుందని చెప్పారు. క్యాన్సర్ వ్యాధికి కూడా స్థూలకాయమే ప్రధాన కారణమని, ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ వ్యాధిబారిన పడుతున్నారన్నారని తెలిపారు.
క్యాన్సర్తో రోజూ అమెరికాలో 1,600 మంది, చైనాలో 8 వేల మంది మరణిస్తున్నారని చెప్పారు. ఆహార నియమాలను పాటించి, శరీరంలో ఇన్సులిన్ స్థాయిని మెరుగుపర్చుకుంటే ఇలాంటి రోగాలు దరిచేరవని చెప్పారు. ఇందుకోసం ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని, పిండి పదార్థాల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. అనంతరం ఆయనను ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ఎల్ వేణుగోపాల నాయుడు, కార్యవర్గ సభ్యురాలు పద్మావతి శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.