నాంపల్లి కోర్టులు, జూన్ 21 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితులైన ముదావత్ ప్రశాంత్, భూక్యా మహేశ్, నర్సింగ్రావుకు బెయిల్ మంజూరు చేస్తూ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. నిందితులు పాస్పోర్టులతోపాటు రూ.20 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుతో జమానత్లను సమర్పించాలని స్పష్టం చేశారు. సిట్ విచారణకు సహకరించాలని, ప్రతి సోమ, శుక్రవారం సిట్ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేయాలని తెలిపారు. కాగా, ఈ కేసులో మరో నిందితుడైన మహ్మద్ ఖాలీద్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
త్వరలో అనుబంధ చార్జిషీట్
ఈ కేసులో సిట్ అధికారులు త్వరలో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. బెయిల్ పొందుతున్న నిందితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో తప్పనిసరిగా అనుబంధ చార్జిషీట్ వేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో 90 రోజుల్లోగా సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నది.