హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): మొక్కల్లో కణజాలం బలంగా ఉంటేనే వాటి ఎదుగుదల, పంట దిగుబడి సాధ్యమవుతుంది. కానీ కొన్ని రకాల బ్యాక్టీరియాలు కణజాలంలోని డీ-అమినోసైల్-టీఆర్ఎన్ఏ డీకైలేజ్ (డీటీడీ) ఎంజైమ్లను నిలువరించి, మొక్కల ఎదుగుదలను దెబ్బతీస్తుండటంతో పంట దిగుబడి తగ్గిపోతున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. హైదరాబాద్లోని సీసీఎంబీకి చెందిన డాక్టర్ శంకర్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం బయో టెక్నాలజీ విభాగంతో కలిసి ప్రొటీన్ సింథసిస్, బ్యాక్టీరియా జీవక్రియలు, మొక్క కణాలు, డీటీడీ ఎంజైమ్లపై పరిశోధన జరిపి కణజాలం పెరుగుదల తీరును, ఎంజైమ్ల శోషణ సామర్థ్యాన్ని పరిశీలించారు. బాక్టీరియాలో ఉండే మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్లు డీటీడీ-1, డీటీడీ-2 ఎంజైమ్లను ప్రభావితం చేసి కణాల వృద్ధిని, మొక్కల ఎదుగుదలను దెబ్బతీస్తున్నట్టు గుర్తించారు. దీంతోనే పంటలకు తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయని తేల్చారు. డీటీడీ-1, డీటీడీ-2 ఎంజైమ్లను ప్రభావితం చేసే బాక్టీరియా ఎదుగుదలను తగ్గించడం ద్వారా పంటల దిగుబడి పెంచవచ్చని భావిస్తున్నారు.