చిక్కడపల్లి, ఏప్రిల్ 5: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్చేశారు. మంగళవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞా న కేంద్రంలో తెలంగాణ బీసీ ప్రజాసమితి 11వ మహాసభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. కేంద్రంలోని విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలన్నారు. కేంద్ర శాఖల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీచేయాలని కోరారు. బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వాటా కోసం బీసీలు పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. ఈ సభలో తెలంగాణ బీసీ ప్రజా సమితి అధ్యక్షుడు జీ కృష్ణాయాదవ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశ్, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీ అనంతయ్య, ఓబీసీ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి, విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.