హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): కరీంనగర్, వరంగల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ ) శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని, ఐదేండ్ల (డిగ్రీ, పీజీ కలిపి) ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బీ వినోద్కుమార్ కోరారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఆయన మంగళవారం లేఖ రాశారు.
రాష్ట్రంలోని విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు కరీంనగర్, వరంగల్లో శాటిలైట్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెగ్యులర్ విద్యతో పాటు మహాత్మా జ్యోతిబాఫూలే, అంబేదర్ పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వెయ్యి గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చదువుకుంటున్నారని వినోద్కుమార్ తెలిపారు.
ఈ గురుకులాల్లో ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో చదువుకుంటున్నారని, వారికి నాణ్యమైన ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు కరీంనగర్, వరంగల్లో సెంట్రల్ యూనివర్సిటీ శాటిలైట్ ఇంటిగ్రేటెడ్ కోర్సుల క్యాంపస్ ఎంతో అవసరమని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో భాగంగా ఐదేండ్లు డిగ్రీ, పీజీ చదువు ఈ క్యాంపస్లోనే జరిగేలా చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.
అలాగే, సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు 30 శాతం సీట్లను కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు. 1969 తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలన్న లక్ష్యంతో సెంట్రల్ యూనివర్సిటీని 1975లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(ఈ) మేరకు ఏర్పాటు చేశారని వినోద్కుమార్ గుర్తు చేశారు.