హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన చట్టం ఇచ్చిన హామీ ప్రకారం కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రకటన చేసిన తరువాతే ప్రధాని మోదీ రాష్ర్టానికి రావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రజల హక్కు అని స్పష్టంచేశారు. గురువారం ఆయన హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాకుండా కేవలం వ్యాగన్ల మరమ్మతులు చేసే సెంటర్ను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని పేరొన్నారు. నాలుగు దశాబ్దాలుగా కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో దాగుడుమూతలు ఆడుతున్నాయని మండిపడ్డారు. రైల్వేశాఖ మంత్రిగా ఎవరు ఉన్నా వారు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను తమ తమ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇదేనా.. జాతీయ సమైక్యతా స్ఫూర్తి..? అని ప్రశ్నించారు.
గతంలో రైల్వేశాఖ మంత్రులుగా పనిచేసిన జాఫర్షరీఫ్ బెంగళూరుకు, మమతాబెనర్జీ పశ్చిమబెంగాల్కు, లాలూప్రసాద్యాదవ్, నితీశ్కుమార్ బీహార్కు, పీయూష్గోయల్ మహారాష్ట్రలోని లాతూర్కు, యూపీఏ చైర్పర్సన్గా సోనియాగాంధీ ఉన్నప్పుడు రాయ్బరేలికి, ప్రధాని మోదీ గుజరాత్లోని దాహోల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక దేశంలో కొత్తగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఇవ్వబోమని ప్రకటించిందని, కానీ 2018లో లాతుర్లో, 2022లో దాహోల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఇచ్చారని, ఇదెకడి న్యాయమని ప్రశ్నించారు.