పాల్వంచ, సెప్టెంబర్ 13: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భవ’ సేవలను దేశంలోని ప్రతి ఇంటికీ చేరవేస్తామని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞప్తి చేశారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్లోని గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్భవన్ నుంచి బుధవారం ఆమె భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో వర్చువల్ విధానంలో ‘ఆయుష్మాన్ భవ’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి ఇంటికీ పథకాన్ని చేరవేసి.. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.
అనంతరం భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పథకం అమలుపై దిశానిర్దేశనం చేశారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ఆయుష్మాన్ భవ ఆరోగ్య కార్డులు జారీ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నదని, అలాగే కేంద్రం కూడా ఆయుష్మాన్ భవ కార్డులు అందిస్తున్నదని పేర్కొన్నారు. గ్రామగ్రామాన ఆయుష్మాన్ భవ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాశాఖ అధికారి డాక్టర్ శిరీష, జిల్లా దవాఖానల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు, పాల్వంచ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ మణికంఠరెడ్డి పాల్గొన్నారు.