హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు విడతలుగా నిర్వహించే సీ టెట్ (సెంట్రల్ టీచర్స్ ఎలిజబిలిటీ టెస్ట్) పరీక్షపై టీ శాట్ నెట్వర్క్ ఛానెల్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఈవో ఆర్ శైలేష్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 11 గంటలకు టీ శాట్ నిపుణ చానెల్లో స్పెషల్ లైవ్ ప్రసారం కానుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థులకు సీ టెట్పై అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో స్పెషల్ లైవ్ ప్రొగ్రామ్ ఏర్పాటు చేసినట్లు శైలేష్ రెడ్డి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు విడతలుగా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆఫ్లైన్ ద్వారా నిర్వహించే అర్హత పరీక్షను ఈ ఏడాది ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున టీ శాట్ అందించే అవగాహన కార్యక్రమం ఉపయోగంగా ఉంటుందన్నారు. అర్హత పరీక్షపై నిర్వహించే అవగాహన కార్యక్రమంలో వరంగల్ డైట్ రిటైర్డ్ లెక్చరర్ చెన్నాడి కేశవ రావు, సీ టెట్ ఇంగ్లీష్ విభాగం టాపర్ కె హరిప్రియ, తెలుగు విభాగం టాపర్ మానస చర్చలో పాల్గొననున్నారు.