జోగులాంబ గద్వాల : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని హిమాలయ హోటల్లో జిల్లా షెడ్యూల్ కులాల సేవ సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గద్వాల నియోజకవర్గ దళితబంధు లబ్ధిదారుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ శ్రీహర్ష ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యావత్ దేశంలోనే ఎక్కడా లేనటువంటి అభివృద్ధి పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సహాయం అందించాలనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, వ్యవసాయానికి ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, మిషన్ భగీరథ పథకాలను అమలు చేస్తూ దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు.
సీఎం కేసీఆర్ దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా దళితబంధును ప్రవేశపెట్టారని, మొదటి విడుతలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక చేశారన్నారు. త్వరలోనే మరో రెండువేల మందిని పథకానికి ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. పథకాన్ని సద్వినియోగం చేసుకొని.. ఆర్థికంగా ఎదుగుతూ మరికొందరికి ఉపాధి కల్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ నియోజకర్గంలో లబ్ధిదారులు పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. అనంతరం వ్యాపారవేత్త బండి విశ్వేశ్వర్ రెడ్డి లబ్ధిదారులకు యూనిట్లపై అవగాహన కల్పించారు.
అనంతరం ఎమ్మెల్యే శాసనసభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ బీ ఎస్ కేశవ్, జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్ బాబు, ఎంపీపీలు విజయ్, ప్రతాప్ గౌడ్, రాజారెడ్డి, రామకృష్ణ, జడ్పీటీసీ పద్మ, నాజూ మున్నిసా బేగం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.