రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఆడపిల్లల హక్కులు, రక్షణపట్ల అందరికీ అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వీ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్లో మహిళా కమిషన్, యాక్షన్ ఎయిడ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. ఆడపిల్లల పట్ల సమాజ ఆలోచనా ధోరణి మారాలన్నారు. ‘ఆడపిల్లను పుట్టనిద్దాం.. బతకనిద్దాం.. చదవనిద్దాం.. ఎదగనిద్దాం’ అనే దృక్పథం సమాజంలో ఉండాలని, ఈ మేర కు ప్రతి ఒక్కరూ చైతన్యవంతమైన పాత్ర పోషించాలని కోరారు. మహిళలకు ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా కమిషన్ అన్నివేళలా అండగా ఉంటుందని సునీతా లక్ష్మారెడ్డి హా మీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షహీనా అఫ్రోజ్, కార్యదర్శి కృష్ణకుమారి పాల్గొన్నారు.
బాలికల రక్షణకు నేడు సంతకాల సేకరణ
హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని స్త్రీ, శిశు సంక్షేమశాఖ డైరెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాలికల రక్షణ, మహిళలపై ఎటువంటి హింసకూ తావులేని సమాజ నిర్మాణం కోసం కృషి చేద్దామన్న సందేశంతో మంగళవారం సంతకాలు సేకరించనున్నారు. బాలికా రక్షణ, పోషణలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారిని మండల, జిల్లా స్థాయిలో రిపబ్లిక్ డే సందర్భంగా సత్కరించనున్నారు.